10, నవంబర్ 2012, శనివారం

స్నేహితుడా .. నీకు వీడుకోలు...



స్నేహితుడా.. వీడ్కోలు..

జీవితం సుఖ దు:ఖాలమయం.  కష్టసుఖాల సమ్మేళనం. 
ఏదీ మనని అడిగి రాదు.  ఏదీ మనకోసం ఆగదు.
జీవితం అంటే ఈ లోకానికి కన్ను తెరచి కన్ను మూసే మధ్యలో గడిచే లిప్త కాలంపాటు నడిచేకాలం.
మనం రావడం నుంచి మనం నిష్క్రమించడం వరకూ ... ప్రపంచ రంగస్థలంపై నడిచే  ఓ గొప్ప నాటకం ...
ఈ నాటకంలో ఏ అంకం ఎప్పుడు మొదలవుతుందో .. ఎప్పుడు అంతమవుతుందో... ఎవరూహించగలరు?
అయితే జరిగే ప్రతీ ముగింపుకూడా  మరో  ప్రారంభమే! 

ఏమిటీ ... ఈ వేదాంతం? ఏమిటీ ... ఈ నైరాశ్యం?

అంతే! మనం ఊహించని సంఘటనలు జరిగినపుడూ...  ఆ సంఘటనలు మనల్ని కదిలించివేసినప్పుడూ ...  మన గుండెల్లోంచి వచ్చే ఆ మాటల వెనుక ఉండే బరువు వేదాంతమే.. ఆ మాటల్లో వినిపించేది నైరాశ్యమే...
***
మే 31, 2012.. ఉదయాన్నే పేపరు చూస్తున్నాను.   
జిల్లా పేజీ చదువుతుంటే ఓ వార్త నన్ను ఉలిక్కి పడేలా చేసింది. 
శ్రీకాకుళం జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి గా పనిచేస్తున్న నా మిత్రుడు పండా రాముడు హఠాత్తుగా మరణించిన వార్త అది...
తను ముందురోజే అంటే 30 తేదీనే చనిపోతే  వెంటనే వాళ్ళ ఊరి తీసుకు వచ్చేసారు.
నేను ఒక్క సారిగా షాక్ అయ్యాను. వెంటనే రవికి ఫోన్ చేసాను.తనుకూడా అప్పుడే చూసాడట. 
వెంటనే వెళ్లి చూద్దాం అనుకున్నాము కానీ... ఆరోజు భారత్ బంద్! వెళ్ళ లేక పోయాము. 
తను పోయినందుకు బాధ కొంత అయితే చివరి చూపులకు వెళ్ళలేక పోయినందుకు మరికొంత బాధ...
బరువెక్కిన  గుండెతో నీలిమకి ఫోన్ చేసాను.
రాముడు చిన్నకూతురు నీలిమ .. రాముడు ఫోన్ చేసినప్పుడల్లా తనతో మాట్లాడించేవాడు. 
తనకి ఫోన్ చేసి నా సంతాపాన్ని తెలియజేశాను. పెద్ద కర్మ ఎప్పుడో తెలియజేస్తే వస్తానని చెప్పాను.
ఆ తర్వాత కన్నారావు కూడా ఫోన్  చేసి మాట్లాడాడు. 
రాముడుకి ముందురోజు రాత్రి 29న రాత్రి గుండెల్లో కొద్దిగా నొప్పి అనిపించిందట. ఏదో మందు వేసుకుని పడుకున్నాదట. ఉదయాన్నే హాస్పిటల్ కి వెళ్లాలనుకున్నారట. సుమారు 11 గంటల సమయంలో హాస్పిటల్ కి వెళ్తుంటే మళ్ళీ గుండెపోటు వచ్చిందట. హాస్పిటల్లో డాక్టరు పరీక్ష చేస్తుండగానే ప్రాణం పోయిందట.
విషయం తెలియగానే కలెక్టరు గారూ, ఇంకా మిగిలిన జిల్లా అధికారులంతా వచ్చి చూసి  భార్యాపిల్లల కోరిక మీద వెంటనే అంబులెన్స్ ఏర్పాటుచేసి వాళ్ళూరు పంపించారట. అప్పుడే తనకీ ఫోన్ చేసారట. ఈ విషయాలన్నీ కన్నారావు చెప్పాడు.   
తర్వాత మూడు నాలుగు రోజుల తర్వాత నీలిమ ఫోన్ చేసి పెద్ద కర్మ జూన్ 20 తేదీన పెద్దకర్మ వచ్చిందని చెప్పింది.
మా మిత్రులందరం ఆరోజు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాం. 
***
జూన్ 20 .. రానే వచ్చింది.
ముందే అందరికీ ఫోన్లు చేసాను. రవి వస్తానన్నాడు. అశోక్ అక్కడే ఉన్నాడు. భాస్కర్, పీటీవీవీ కూడా వస్తామన్నారు.
కానీ రవికి స్కూల్లో కుదరలేదు. ఉదయాన్నే  ఖమ్మం నుండి నేను బయలుదేరాను. పీటీవీవీ ముందురోజు రాత్రే  భద్రాచలం వచ్చేసాడు.  భాస్కర్ పొద్దున్నే బయలుదేరి వస్తున్నానని చెప్పాడు. భద్రాచలం చేరాక పీటీవీవీ కి ఫోన్ చేస్తే బస్టాండ్ కి వచ్చేసాడు. భాస్కర్ రాలేదు. వస్తాడో రాడో తెలీదు. నేనూ, పీటీవీవీ ఇద్దరం మళ్ళీ బస్సెక్కాము.
బస్సెక్కిన దగ్గర్నించీ రాముడి గురించే  మాట్లాడుకున్నాం. పీటీవీవీ తనతో రాముడు మాట్లాడిన సంగతులే చెప్పాడు. వి.ఆర్.పురం వెళ్ళే వరకూ తనగురించీ వాళ్ళ పిల్లల గురించే మాట్లాడుకున్నాం.  
పెద్దమ్మాయి బిందు ఎం.సి.ఏ పూర్తి చేసింది. రెండో అమ్మాయి ప్రియాంక బి.టెక్. పూర్తి కావచ్చింది. మూడో అమ్మాయి నీలిమ  ఇంటర్ చదువుతోంది. పిల్లలకి ఏ లోటూ లేకుండా చదువులైతే చెప్పించాడు గానీ, ఆస్తులైతే కూడబెట్ట లేదు.
అలా మాట్లాడుకుంటు ఉండగానే వి.ఆర్.పురం  వచ్చేసింది. అక్కడ అశోక్ కలిశాడు. ముగ్గురం మోటార్ సైకిళ్ళపై పెదమట్టపల్లి వెళ్ళాం. కన్నారావు అక్కడే ఉన్నాడు. మూడు రోజులైందట అక్కడికొచ్చి. రాముడు భార్యనీ, పిల్లల్నీ కలిసి మా సంతాపం తెలియజేశాం.  
రాముడుకు ఈ లోకం నుండి వీడుకోలు చెప్పే తంతు పూర్తయింది. 
తిరిగి రాని లోకాలకు తరలిపోయిన స్నేహితుడా.... 
పైలోకం  నీ కోసం ద్వారాలు తెరచి ఉంచింది... 
స్వాగతం పలుకుతోంది... వెళ్ళిరా... నేస్తమా .. వెళ్ళిరా.. 
నీకిదే మా చివరి వీడుకోలు...
***
ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం నుండి కొందరు అధికారులు కూడా వచ్చారు.  తన స్నేహితులు ... మాతో చదువుకున్నవాళ్ళే కాకుండా, తనతో కలిసి పనిచేసిన ఉద్యోగులూ, ఇంకా సన్నిహితులూ ఇతర మిత్రులూ కూడా వచ్చారు.
నేనూ, కన్నారావూ, అశోకూ, పీటీవీవీ.. చాలాసేపు వాడిగురించే మాట్లాడుకున్నాం.
ఆ తర్వాత మా సంభాషణ మేం చదువుకున్న స్కూల్ మీదకీ, మాకు పాఠాలు చెప్పిన గురువులమీదకీ మళ్లింది. ముఖ్యంగా మా జీవితాల్లో ఎంతో మార్పు తీసుకు వచ్చిన గురువుగారు ఎర్రాప్రగడ రామ్మూర్తి గారి మీదకు మళ్లింది. ఆయన మాకు చదువులు చెప్పిన రోజులూ, పరిక్షల ముందు ఆయన ఇంటికి వెళ్లి అక్కడే చదువుకుని పడుకున్న రోజులూ గుర్తు చేసుకున్నాం.
అప్పుడే ఎలాగైనా  మళ్ళీ అందరం కలుసుకోవాలి అనే విషయం మీదకి మళ్లింది. ఎప్పటినుండో వాయిదాలు పడుతూ వస్తున్న ఆ విషయం మళ్ళీ రంగం మీదకి వచ్చింది. అప్పుడే నిర్ణయించేసుకున్నాం... త్వరలోనే కలుసుకోవాలని...
కన్నారావు ప్రోగ్రాం డిసైడ్ చేసేసాడు. సెప్టెంబర్ 5.. గురుపూజోత్సవం... ఆరోజే చేసేద్దాం.. అన్నాడు.
కానీ, రవీ, మా ఆవిడా టీచర్లు.. వాళ్ళు ఆరోజు స్కూల్లో తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి ఆ తరువాత వచ్చే ఆదివారం అంటే సెప్టెంబరు 9 నాడు ఆ కార్యక్రమం జరపాలని నిర్ణయించాము.
ఎప్పుడో 1974 లో విడిపోయిన మా స్నేహితులందరం కలుసుకోవడం ... మా పునర్మిలనం ఖచ్చితంగా జరగాలని నిర్ణయించేసాము.
అందరికీ చెప్పెయ్యాలి.. కానీ ఎవరు ఎక్కడ ఉన్నారో, ఎవరు  ఏమి చేస్తున్నారో.. అందరికీ  సమాచారం అందేది ఎలా?
ఆ వివరాలు సేకరించే బాధ్యత నామీదే పెట్టారు అందరూ కలిసి.
కార్యక్రమం ఎలా నిర్వహించాలా అని కాసేపు చర్చించుకుని ఎవరిళ్ళకి వాళ్ళం బయలుదేరాం.
....
అందుకే మొదట్లో అన్నాను ..
ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేము...
ఎప్పుడు ఏది ముగిసిపోతుందో..
ఎప్పుడు ఏది మొదలవుతుందో..
ఏ అంతంలో ఏ ఆరంభం ఉందో..
ఏ ముగింపు దేనికి నాంది అవుతుందో..
“ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ...”
మొత్తానికి ఒకటి స్పష్టమైంది. ఎన్నడో విడిపోయిన స్నేహితులందరం త్వరలోనే కలవబోతున్నాం. 
ఆ కార్యక్రమానికి సన్నాహాలు మొదలయ్యాయి. అప్పట్నించీ ఆ కార్యక్రమం గురించే నా ఊహలూ, ఆలోచనలూ..
ఆ సన్నాహాల గురించి తర్వాత పోస్ట్ లో చెబుతాను.

2, నవంబర్ 2012, శుక్రవారం

ఎర్రాప్రగడ రామ్మూర్తి మాస్టారు



ఓసారి నాఉద్యోగంలో భాగంగా మణుగూరు సమీపంలోని పినపాక మండల కేంద్రానికి వెళ్ళాల్సి వచ్చింది.
ఆ అవకాశం రావడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే అది కేవలం ఉద్యోగ బాధ్యత మాత్రమే కాదు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశం, ఉద్యోగం లోని వత్తిళ్ళ వల్ల నేను చెయ్యలేని పనీనూ. 
అది... మాకు ఎంతో ప్రీతి పాత్రమైన, నా జీవితంలో నా ఎదుగుదలకీ, నాలోని భావుకతకీ కారణమై, అంతర్లీనంగా నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసిన గురువుగారిని కలుసుకోబోయే అవకాశం. 
ఆయన... 
మాకు పదో తరగతిలో పాఠాలు చెప్పిన తెలుగు మేష్టారు, ‘అభినవ పెద్దన’ బిరుదాంకితులు ...
శ్రీ ఎర్రాప్రగడ రామ్మూర్తి గారు.  
తెలుగుమీద నాకున్న అభిమానానికీ ఆయనే కారణం. అలాగే నేను ఆంగ్ల భాషలో కొద్దోగొప్పో పట్టు లభించిందీ అంటే దానివెనుక కూడా కారణం ఆయనే.  అందుకే ఆయనంటే నాకెంతో అభిమానం. 
ఆయనని పదో తరగతి తర్వాత మళ్ళీ చూడలేదు. మేం ఇంటర్మీడియట్ చదివేటప్పుడు భద్రాచలంలోని చిన్న హైస్కూల్ కి బదిలీపై వచ్చినా ఆయనని కలవలేకపోయాను.  
ఆయన గురించీ, ఆయన రాసే కవిత్వం గురించీ పేపర్లో చదువుతూనే ఉన్నాను.  ఆయన రిటైర్ అయ్యాకా వార్త పేపర్ లో “తాతయ్య కబుర్లు” పేరుతో తెలుగు భాషపైనా, ఆంగ్ల భాషపైనా చాలా వ్యాసాలు రాసారు. పిల్లలకోసం తేలికైన భాషలో కళాపూర్ణోదయం లాంటి కొన్ని ప్రబంధాలు కూడా రాసారు. ఆయన గురించి చదువుతున్న ప్రతీ సారీ ఆయన్ని కలవాలని అనుకుంటూనే ఉన్నాను. 
ఆయన రిటైర్ అయిన తర్వాత పినపాకలోనే ఇల్లు కట్టుకుని అక్కడే ఉంటున్నట్లుగా తెలిసి, ఆ ఊరికే ఆఫీసు పనిమీద వెళ్లడం నాకోసమే వచ్చిన గొప్ప అవకాశంలా అనిపించింది. 
ఇక్కడ ఆయన గురించి కొంత చెప్పాలి. కొంతేమిటి? చాలా చెప్పాలి.
ఆయన గురించి చెప్పాలీ అంటే ... ఆల్-ఇన్-వన్... అని చెప్పాలి.
తెల్లగా ఆరడుగుల ఎత్తూ.., నుదుట సన్నగా పొడుగ్గా నామంతో అందంగా కనిపించే ఆయన కన్యాశుల్కం పుస్తకం అట్టమీద బొమ్మలో పంచె కట్టుకుని నోట్లో చుట్ట పెట్టుకుని ఠీవిగా నిలబడ్డ బాపు గీసిన గిరీశం బొమ్మ గుర్తొస్తుంది. ఆయన మా స్కూలుకి వచ్చిన తెలుగు మాస్టారు. మేం ఎనిమిదో తరగతి చదువుతుండగా మా స్కూలుకి వచ్చారు.  తెలుగుదనం ఉట్టిపడే చక్కని సాంప్రదాయబద్ధమైన పంచెకట్టుతో నుదుట సన్నని గీతలాంటి తిరునామంతో తెలుగు మాస్టారు అంటే ఇలా ఉండాలి అనేలా ఉండేవారు. ఒకే ఒక్క సారి మేం ఆయన్ని ఫాంటు షర్టుతో చూశాం. 
ఆయన తెలుగు పాఠాలు చెబుతుంటే వినడం మాకో గొప్ప అనుభూతి. ఆయన చెప్పే ప్రతీ పాఠం మాకో పద చిత్రం. ఆయన పాఠాలు చెబుతుంటే ఆ పాఠంలోని సన్నివేశాలు మా కళ్ళ ముందు చలన చిత్రంలాగా కదలాడుతూ ఉండేవి.  సున్నితంగా నవ్వుతూ, నవ్విస్తూ, ఉండే ఆయన ఎవర్నీ కొట్టడం మాకు తెలీదు. కనీసం గట్టిగా కసరడం కూడా మేమేరుగం.
ఆయన పాఠాలు చెప్పే మాస్టారు మాత్రమే కాదూ, గొప్ప కవి అనీ, కవిత్వం కూడా బాగా రాస్తారనీ మాకు తెలిసాక మాకు ఆయనమీద గౌరవం ఇంకా పెరిగింది.  ఆయన సమస్యాపూరణం లో దిట్ట అని కూడా తెలిసింది. మేం పదో తరగతి చదువుతుండగా అనుకుంటాను ఆయన రాసిన సమస్యాపూరణలన్నీ సంకలనం చేసిన పుస్తకం ఒకటి ముద్రించారు.  అది చదివాక నాక్కూడా తెలుగు భాషమీదా, తెలుగు కవిత్వం మీదా అభిమానం పెరిగింది. ఆయన మాకు .. ముఖ్యంగా నాకు .. ఓ ఆదర్శమూర్తి.
పాఠాలు చెప్పడంలో ఆయన విశ్వరూపం పదో తరగతిలో మేము చూసాము.  మేము పదో తరగతిలోకి వచ్చేసరికి మిగిలిన మేష్టార్లు అందరూ బదిలీలపై వెళ్ళిపోయారు. అప్పుడు పదో తరగతికి లెక్కలు, సైన్సూ, హిందీ, ఇంగ్లీషు పాఠాలు చెప్పడానికి వేరే ఎవరూ లేకపోవడంతో ఆయన చెప్పే తెలుగుతో పాటుగా ఆయనే అన్ని సబ్జెక్టులూ చెప్పడం మొదలు పెట్టారు.  అదే సంవత్సరం పదో తరగతి పరిక్షలు రాయడానికి మా స్కూలుకే సెంటరు వచ్చింది.  అప్పటివరకూ ఆ స్కూల్లో చదువుకునే వాళ్ళంతా పడవ దాటి వెళ్లి కూనవరంలో పరిక్షలు రాయాల్సి వచ్చేది.  అలాంటిది మా బడిలోనే పరిక్షలు రాసే అవకాశం మాకు రావడంతో, ఎలాగైనా మంచి ఫలితాలు రాబట్టాలనే తపనతో మాష్టారు పట్ట్టుదలగా అన్నీ మాకు చెప్పడం మొదలు పెట్టేరు.
ఆయన పాఠం చెప్పడమే ఒక వరమైతే అన్ని క్లాసులూ ఆయనే చెప్పడం మాకు ఎంతో ఆనందం కలిగించింది. ఆయన లెక్కలు చెప్పినా సైన్సు చెప్పినా కూడా తెలుగు పద్య భాగాలు వివరించి చెప్పినట్టుగానే ఉండేవి. ఇంకా ఇంగ్లీషు, హిందీ సబ్జెక్టులైతే చెప్పనే అక్కరలేదు. ఇంగ్లీషు, హిందీ చెప్పే మాస్టార్లు బదిలీపై వెళ్ళిపోతే ఆ సబ్జెక్టులు కూడా ఆయనే చెప్పారు. 
ఇంగ్లీషులో పోయిట్రీలో అది టెన్నిసన్ అయినా వర్డ్స్ వర్త్ అయినా అక్కడ మాకు కనిపించేది మా తెలుగు మాస్టారే! మా రామ్మూర్తి మాస్టారే! పోయిట్రీలో “ది బ్రూక్స్” అనే లార్డ్ టెన్నిసన్ రాసిన  పొయిమ్ ఉండేది.  దాన్ని టెన్నిసన్ ఎంత భావుకత (ఫీల్) తో రాసాడో నాకు తెలీదు గానీ రామ్మూర్తి మాస్టారి బోధనలో ఆ భావుకత .. ఆ పద్య సన్నివేశంలోకి మమ్మల్ని తీసుకుపోయేది. మాకు – ముఖ్యంగా నాకు మాత్రం – ఆ పోయిమ్ మాస్టారు రాసిందేనేమో అనిపించేది. ఆ పాఠాలు వింటుంటే కలిగే భావుకత మిగిలిన అన్ని పరిసరాలనూ మర్చిపోయేలా చేసేది. ఒక్కోసారి అప్పుడే క్లాసు అయిపోయిందా అనిపించేది.   అలా పాఠాలు చెప్పేవారు ఆయన.
ఆ తర్వాతెప్పుడో ఓసారి.. లాంచీలో రాజమండ్రీ వెళ్తుంటే మధ్యలో చాలా పెద్ద వర్షం మొదలైంది. ఆ వర్షం కురుస్తున్న సమయంలో లాంచీ పాపికొండల మధ్యలో ఉంది. ఆ వర్షం పాపికొండలపై వర్షిస్తే ఆ వర్షపునీరు పిల్ల కాలువల్లా, చిన్న చిన్న జలపాతాల్లా కొండల మీదనుండి కిందికి జారుతూ, దూకుతూ ప్రవహిస్తూంటే ఆ దృశ్యం ఎంత అందంగా ఉంది?  ఆ సమయంలో నాకింకేమీ గుర్తుకురాలేదు. మాస్టారు వర్ణించి వివరించి చెప్పిన టెన్నిసన్ “ది బ్రూక్స్” మాత్రమే ఆ ప్రయాణమంతా గుర్తుకొచ్చింది. లాంచీదిగే దాకా “ది బ్రూక్స్” మననం చేసుకుంటూనే ఉన్నాను. మామూలు మనిషిని నాకే అంత భావుకత కలిగితే గొప్ప కవి.. ఆయనకి ఇంకెంత భావుకత కలిగి ఉంటుందోననిపించింది.  ఆ భావుకత ఉన్నందునే టెన్నిసన్ రాసిన ఆ పద్య భాగాన్ని టెన్నిసన్ రాసిన దానికంటే  భావుకతతో, భావయుక్తంగా మాస్టారు చెప్పగలిగారు అని నాకనిపిస్తుంది. అంతలా మనసుకు హత్తుకుపోయేలా వివరించి చెప్పే వారాయన. అంతేగాదు ఏ పాఠం చెప్పినా నవరసానుభూతులను రంగరించి ఉగ్గుపాలలా మాకు అందించేవారు.
పరిక్షలు దగ్గర పడుతుండగా స్కూల్లోనే కాకుండా మమ్మల్ని ఇంటికి రమ్మని ఇంటి వద్ద కూడా పాఠాలు చెప్పడం మొదలు పెట్టేరు. స్కూల్ నించి ఇంటికి వెళ్లి, సాయంత్రం భోజనం చేసి ఏడున్నర అయ్యేసరికల్లా మేస్టారి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. చదువుకున్నంతసేపు చదువుకుని రాత్రికి అక్కడే పడుకునేవాళ్ళం. మాస్టారు మమ్మల్ని తెల్లారకుండా లేపి చదివించేవారు. అంతలా శ్రద్ధ తీసుకుని చదివించే వారుకాబట్టే మా క్లాస్ లోని పన్నెండు మందిలో ఏడుగురం పాసయ్యాము. అందులో మూడు సెకండు క్లాసులు.  క్లాసులో ఎప్పుడూ ఎక్కువ మార్కులు రాని నేను కూడా సెకండు క్లాసులో పాసయ్యాను. పైగా క్లాసులో రెండో స్థానం నాదే. లెక్కల్లో రవి కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. అప్పటి వరకూ నాకూ తెలీదు నాక్కూడా మంచి మార్కులు వస్తాయనీ, రవి కంటేకూడా ఎక్కువ మార్కులు వస్తాయనీనూ. ఇంకా అప్పటి వరకూ హాస్టల్లో ఉండి చదువుకున్నావాళ్ళెవరూ పాస్ కాలేదు.  కానీ, హాస్టల్లో ఉండి చదువుకున్న మా మిత్రులు  రాముడూ, కన్నారావూ, సుబ్బారావు ముగ్గురూ పాసయ్యారు. అప్పటికి అదే రికార్డు. ఇదంతా రామ్మూర్తి మాస్టారి చలవే.
ఇదంతా గుర్తుకువచ్చి ఎలాగైనా ఆయన్నికలుసుకోవాలని పినపాక వెళ్లాను.  ఆయన్ని గురించి మండల కార్యాలయంలో అడిగాను. అక్కడి వాళ్ళు వెంటనే రామాలయంలో అయ్యగారి గురించేనా అడిగేది? అని అడిగారు. నేను ఆయన కాదేమోనని కాస్త తటపటాయించాను. కానీ ఆయన గతంలో టీచర్ గా పనిచేసి రిటైర్ అయ్యారని వాళ్ళు చెప్పాక ఒకసారి చూసి వద్దాం అనుకుని బయలుదేరాను.
వారిది చిన్న ఇల్లు. చుట్టూ పెరడూ, పూలమోక్కలూ.. వాతావరణం, పరిసరాలూ చాలా బాగున్నాయి. వారి ఇంటికి వెళ్ళాక మాస్టారుగారి శ్రీమతి కనిపించారు గుర్తు పట్టాను. నన్ను నేను పరిచయం చేసుకున్నాను. ఆవిడ చాలా సంతోషించారు. మాస్టారు పెరట్లో ఉన్నారు, పిలుస్తాను కూర్చోమని చెప్పి లోపలి వెళ్లారు. ఆవిడ ఏమీ మారలేదు. అదే ఆప్యాయత, అదే అభిమానం.  మాస్టారు వచ్చారు. ఆయన్ని చూడగానే గుర్తు పట్టాను. ఆయనలో ఏమీ మార్పు లేదు. వయసువల్ల జుట్టు తెల్లబడడం లాంటివి తప్ప!  అప్పటిదాకా పడ్డ ఆదుర్దా అంతా ఆయన్ని చూడగానే క్షణంలో మటుమాయమై పోయింది. ఆయన కనబడగానే మొదట పాదాలకి నమస్కారం చేసాను. నన్ను నేను పరిచయం చేసుకున్నాను.  అప్పుడు ఆయన గుర్తుపట్టారు. ఆయన తన ఉపాధ్యాయ జీవితంలో ఎందరికో పాఠాలు చెప్పి ఉంటారు. అంతమందిలో నన్ను గుర్తు పట్టడం గొప్ప విషయమే.
నేనలా వెతుక్కుంటూ రావడం ఆయనక్కూడా చాలా ఆనందాన్ని కలిగించింది. రవినీ, పీటీవీవీనీ, భాస్కర్ రావునీ, అశోకునీ, పండా రాముడినీ, ఇలా అందర్నీ గుర్తుకు తెచ్చుకుని పేరు పేరునా అడిగారు.  ఆయన ముఖ్యంగా కన్నయ్య అనే వాడుండాలీ అంటూ కన్నారావును గురించి అడిగారు. మొదట్లో కన్నారావు అంతబాగా చదివేవాడు కాదట. కన్నారావు వాళ్ళ నాన్నగారు మాష్టారిని కలిసి కన్నారావును ఎలాగైనా దార్లో పెట్టమని అడిగారట. దాంతో మాస్టారు ఓరోజు కన్నారావును దగ్గర కూర్చోబెట్టుకుని చదువు విలువ చెప్పి మంచిగా చదువుకోమని ఉద్బోధించారట. ఆ తర్వాతే కన్నారావులో పట్టుదల పెరిగి బాగా చదివాడట.  ఆవిషయం చెప్పి ఎలా ఉన్నాడు, ఏంచేస్తున్నాడు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత నేను వచ్చేస్తుంటే ఆయన రాసిన చాలా పుస్తకాలు నాకు గుర్తుగా ఇచ్చారు. మాస్టారి భార్య కూడా ఎంతో అప్యాయంగా మాట్లాడారు. ఎంతో ఆదరణ చూపారు. గుండెల నిండా మాస్టార్ని చూసిన ఆనందాన్ని నింపుకుని తిరుగు ప్రయాణం కట్టాను.
ఇంటికి తిరిగి వచ్చాకా కన్నారావుకి ఫోన్ చేసి చెప్పాను. ఆయన తననెంతగా గుర్తు పెట్టుకున్నారో చెప్పాను. తనక్కూడా ఆయన్ని చూడాలనిపిస్తుందని చెప్పాడు. ఆయనతో మాట్లాడతానని మాస్టారి ఫోన్ నెంబరు కూడా తీసుకున్నాడు. ఓసారి పినపాక వెళ్లి ఆయన్ని చూడాలనీ, ఆయనకీ తానెంతో ఋణపడి ఉన్నాననీ, ఆయన కోసం ఏమైనా చేయాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. అందరం కలిసి వెళ్తే బాగుంటుందని అనిపించింది. రాముడినీ, ఇంకా ఇతర మిత్రులనీ కూడగట్టుకుని ఒక సన్మానం లాంటిది చేద్దాం అన్నాడు. అప్పటికే కన్నారావు ప్రభుత్వ బీమా సంస్థలో ఉన్నతాధికారి. తీరిక సమయం దొరికే ఉద్యోగం కాదది.
రాముడుతో కూడా మాట్లాడాను. అప్పుడు తను కృష్ణా జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి (CPO) గా పని చేస్తున్నాడు.  ఎప్పుడూ జిల్లా కలెక్టరుకు చేదోడు వాదోడుగా ఉండే ఉద్యోగం తనది. క్షణం కూడా ఖాళీ లేని ఉద్యోగం... తనకీ అందర్నీ చూడాలనుందనీ, ఏర్పాట్లు చేస్తే తనుకూడా వస్తాను అన్నాడు. రవీ, పీటీవీవీ, భాస్కర్రావు... అందర్నీ సంప్రదించాను. అందరూ సరేనన్నారు. కానీ సమయం, వేదిక కుదరలేదు. ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య. నా ఉద్యోగంలోనూ తీరిక లేక ఎక్కడ మా సమాగమం ఏర్పాటు చేయాలో ఎప్పుడు చేయాలో ఆలోచిస్తుండగానే చాలా కాలం జరిగిపోయింది. 
కానీ కాలం కలిసి రాలేదు ... అందరం కలిసే ఆ మధుర క్షణం రాలేదు.  ఎప్పటికొస్తుందో .. ఏమో...
కానీ తప్పక వస్తుందనే నమ్మకం నాకుంది... దానికోసమే ఎదురు చూస్తున్నా...

31, అక్టోబర్ 2012, బుధవారం

నేనూ నా స్నేహితులూ..



పోయినసారి  నా మిత్రుల గురించి చెప్పాను. 

మేమందరం ఓసారి కలుసుకుందామని అనుకుంటున్నట్లూ, మాకు చదువు చెప్పిన గురువుల్ని సత్కరించాలని అనుకుంటున్నట్లూ చెప్పాను కదా..

మా బాచ్ లో అమ్మాయిలు తప్ప మిగిలిన అందరం ఎప్పుడో ఓసారి కలుసుకుంటూనే ఉన్నాం. కన్నారావు, రాముడూ తరచుగా ఫోన్ చేసేవాళ్ళు.  రవి ఇక్కడే ఖమ్మంలో ఉంటున్నాడు కనుక అప్పుడప్పుడూ కలుసుకుంటూనే ఉంటాం. భాస్కర్రావు చర్ల లో ఉంటాడు. ఎప్పుడైనా ఖమ్మం వస్తే నన్ను కలిసేవాడు. నేనూ అప్పుడప్పుడూ ఫోన్ చేస్తుండేవాడిని. అశోక్ వి.ఆర్.పురం లోనే ఉంటున్నాడు కనుక అక్కడికి వెళ్తే వాడూ కలిసేవాడు. ఇంక నాకు కలవని వాళ్ళు ప్రకాష్, సుబ్బారావూనూ. 

ప్రకాష్ రాజమండ్రీలో ఉంటున్నట్లు, ఆర్యాపురం కోపరేటివ్ బాంకులో పనిచేస్తున్నట్లూ తెలుసు కానీ, వెళ్ళలేదు, కలవలేదు.   రాజమండ్రీలో ఎక్కడ ఉంటున్నదీ తెలియదు. నేను రాజమండ్రీ వెళ్ళేదే తక్కువ. బంధువుల ఇళ్ళల్లో’ పెళ్ళిళ్ళకు అటువైపు వెళ్ళినా రాజమండ్రీలో ఆగడం కుదరలేదు. కానీ ఎలాగైనా కలవాలనే కోరిక నాలో బలంగానే ఉంది. ఆమధ్య ఓసారి  కొవ్వూరులో ఓ బంధువు ఇల్లు కట్టుకుని గృహప్రవేశానికి పిలిస్తే వెళ్లాను. తిరిగి వెనక్కి రావడానికి బస్సుకి చాలా సమయం ఉందంటే నా పాత మిత్రుడిని కలవడానికి  ఇదే మంచి అవకాశమని ఓసారి రాజమండ్రీ వెళ్లి వస్తానని మావాళ్ళకి చెప్పి బస్సెక్కాను. రాజమండ్రీలో బస్సు దిగి ఆటోలో జాంపేట వెళ్లాను. ఆర్యాపురం కోపరేటివ్ బ్యాంక్ ఎక్కడో తెలుసుకుని అక్కడికి వెళ్లాను. ప్రకాష్ గురించి బ్యాంక్ వాచ్ మాన్ ను అడిగాను. లోపలే ఉన్నారని చెప్పాడు. ఆతృతగా లోపలికి వెళ్లి చూసాను గుర్తుపట్టగలనో లేదో అనుకుంటూ..  సీట్లో తలొంచుకుని పనిచేసుకుంటూ కూర్చున్న వ్యక్తిని చూసాను. తనేనా..కాదా? అనుకుంటూ చూస్తున్నాను. తనే! అప్పటి పోలికలు ఉన్నా చాలా మార్పు కనిపిస్తోంది. బట్ట తల వచ్చేసింది. నన్ను గుర్తుపట్టగలడా.. అనుకుంటూ తననే చూస్తూ నిల్చున్నాను.  చేతిలో పని అయిపోయాకా తల పైకెత్తి ఏమి కావాలన్నట్లు చూసాడు. “ప్రకాష్ మీరేనా..?” అని అడిగాను. “నేనే.. ఏంకావాలి?..” అంటూ నాకేసి చూసి ఒక్క క్షణం ఆగి పోయాడు. “మీరు.. మీరు..” అంటూ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఆగిపోయాడు. నేనెవరో చెప్పాను. అతని మోహంలో ఆశ్చర్యంతో కూడిన ఆనందం.. లోపలి పిలిచి కూర్చోబెట్టి ప్రశ్నలతో ముంచేశాడు. ఎన్నాళ్ళయిందో.. చూసి. పదో తరగతి తర్వాత ఇదే తనని చూడడం.  ముప్ఫై మూడేళ్ళు అవుతోంది సుమారుగా.. అన్ని ప్రశ్నలు వేసినా నేనొకటి గమనించాను. తనలో అప్పటి మొహమాటం, రిజర్వుడు గా ఉండే తత్వమూ ఏమీ మారలేదు.  కాసేపు మాట్లాడుకున్న తర్వాత వచ్చేశాను. భోజనానికి ఉండమన్నాడుకానీ వచ్చేశాను. ఆ తర్వాత అప్పుడప్పుడూ ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం.

నేను ఇంటర్ అయిపోయిన తర్వాత అస్సలు కలుసుకోనిది సుబ్బారావునే. ఇంటర్ అయిపోగానే రాముడూ, కన్నారావూ పై చదువుల కోసం వెళ్ళిపోయినా, సుబ్బారావు మాత్రం వాళ్ళ ఊళ్లోనే ఉండిపోయి వ్యవసాయం చేసుకుంటూ అక్కడే ఉండిపోయాడు. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత భద్రాచలం బస్టాండులో కన్నారావు కలిసినప్పుడు సుబ్బారావు గురించి అడిగితె తనేదో స్వచ్చంద సంస్థలో పని చేస్తున్నట్లు చెప్పాడు.  ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఐటిడిఏ స్కూల్లో పని చేస్తున్నట్లుగా తెలిసింది.

వీళ్ళుగాక మాతో కలిసి చదువుకున్న మరో నలుగురు స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళు పదోతరగతి వరకూ మాతో కలిసి ఆ బళ్ళో చదువుకోలేదు గానీ, ఉన్నంత వరకూ మాతో కలిసిపోయి మేము విడిపోయినా మేము మరచిపోలేని వాళ్ళు.

వాళ్ళల్లో కొంపెల్ల రామ్మూర్తి ఒకడు. డిప్యుటీ స్కూల్స్ ఇన్స్పెక్టరు గారు విశ్వనాధం గారి పెద్దబ్బాయి. ఆరు ఏడు తరగతుల వరకూ మాతోనే కలిసి చదివినా ఉపనయనం కోసం వాళ్ళ ఊరు వెళ్లి అక్కడే ఉండిపోయాడు. ఓ సంవత్సరం చదువు ఆగిపోయింది. అక్కడే స్కూల్లో జాయిన్ అయ్యాడు. మళ్ళీ మేం పదో తరగతిలోకి వచ్చాక మళ్ళీ ఇక్కడికి వచ్చి తొమ్మిదో తరగతిలో చేరాడు. కొంపెల్ల రామ్మూర్తి కాదు వాడు. కోతి రామ్మూర్తి అనేవాళ్ళు అందరూ. నిజంగా వాడు కోతే! బాగా అల్లరి చేసేవాడు.

కావూరు పాపయ్య గారని హిందీ మేష్టారు ఉండేవారు.  ఆయన తమ్ముడు గోపీకృష్ణ. ఎనిమిదో తరగతిలో మాతో కలిశాడు. తొమ్మిది వరకూ చదివి మళ్ళీ వాళ్ళ సొంతూరికి వెళ్ళిపోయాడు. చాలా చలాకీగా ఉండేవాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు.

ఇంక నాగు. అనప్పిండి వెంకట నాగేంద్ర కుమార్ పూర్తి పేరు. మాకు స్కూల్లో హిందీ, లెక్కలు చెప్పిన శర్మ మేస్టారి తమ్ముడు.  వాళ్ళ అన్నదమ్ములందరూ ఉపాధ్యాయ వృత్తిలోనే ఉన్నారు.  ఆమాటకొస్తే వాళ్ళ కుటుంబం అంతా ఉపాధ్యాయులే. వాళ్ళ కుటుంబం గురించి మరోసారి చెప్పుకుందాం. అందర్లోకీ నాగూనే చిన్నవాడు. ఒకటో తరగతి నుండీ ఆరో తరగతి వరకూ మాతో కలిసి చదివాడు. బాగా చదివేవాడు. ప్రతీదానికీ అందరితో పోటీ పడేవాడు. అతని ఆఖరు అన్నయ్యకి – సుబ్బు అనేవాళ్ళం – తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురం దగ్గర ఉద్యోగం వస్తే అతని దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఉండి చదువుకొన్నాడు. ఎనిమిదో తరగతిలో వచ్చి మాతో చదివాడు. మళ్ళీ తొమ్మిదో తరగతిలో వాళ్ళ అన్నయ్య దగ్గరకి వెళ్ళిపోయాడు. ఇంక ఆతర్వాత మాతో కలవలేదు.  ఆ తర్వాత ఎప్పుడో ఆయనకీ బ్యాంకులో ఉద్యోగం వచ్చాక కలిశాడు.

నాలుగోవాడు బెహరా రామకృష్ణ.  మా తెలుగు మాస్టారు ఎర్రాప్రగడ రామ్మూర్తి గారి బంధువులబ్బాయి. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట దగ్గర వాళ్ళ ఊరు. అక్కడ అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడని ఇక్కడికి తీసుకు వచ్చారాయన. పదో తరగతిలో చేరాడు. వయసుపరంగా మాకంటే పెద్దవాడే. తెగ కబుర్లు చెప్పేవాడు. బాగా కోతలు కోసేవాడు. పదో తరగతి పరిక్షలు రాయకుండానే వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. కానీ మాకందరికీ బాగా గుర్తుండిపోయాడు.

వీళ్ళేగాక విశ్వేశ్వర రావు అనే మరో మిత్రుడు ఆరు ఏడు తరగతులు మాతో కలిసి చదివాడు. మాకు సాంఘికశాస్త్రం చెప్పిన డేవిడ్ మాష్టారి బంధువు. బాగా అల్లరి చేసేవాడు. ఆ తర్వాత ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో మాకు తెలీలేదు.

ఇంక అమ్మాయిల విషయానికొస్తే అప్పట్లో అమ్మాయిలతో మాట్లాడడం అంటే మాకు బెరుకు. ఏదో స్కూల్లో ఉన్నప్పుడే కాస్త మాట్లాడుకోవడం. లేకపొతే అదీ లేదు. పదో తరగతి తర్వాత ఎవరు ఎక్కడున్నారో తెలీదు. రాజేశ్వరి మా ఊరే కాబట్టి పెళ్ళయిన సంగతి తెలుసు. తర్వాత తిరుపతి వెళ్ళిపోయింది. మిగిలిన ఇద్దరూ.. అమ్మాజీ, విజయలక్ష్మీ.. ఎక్కడున్నారో... ఓసారి బస్సులో అమ్మాజీ కలిసింది. కూనవరంలో బస్సెక్కింది. అవునా కాదా అంటూనే పలకరించాను. తనే.. హైదరాబాదులో ఉంటున్నట్టు చెప్పింది. వాళ్ళాయన భూగర్భజల శాఖలో పనిచేస్తున్నట్లు చెప్పింది. అంతే. ఫోన్ నెంబరు అడగడానికి మొహమాటం వేసి అడగలేదు.  ఆతర్వాత తన వివరాలు తెలీలేదు. విజయలక్ష్మిని పదో తరగతి తర్వాత అసలు చూడనేలేదు.. ఎక్కడుందో తెలీదు.
వీళ్ళే గాక ఇంకా రాజాగారి అమ్మాయి వెంకాయమ్మా, ఈవో గారమ్మాయి సుబ్బలక్ష్మీ, గొల్లకోటి విజయలక్ష్మీ  ఇంకా జ్యోత్స్నా కూడా మాతో చదివారు.  వాళ్ళు ఎక్కడున్నారో ఏమో. 

గొల్లకోటి విజయలక్ష్మి.. తనుమాత్రం మధ్యలో కలిసేది. వాళ్ళ తాతగారూ, మా నాన్నగారూ మంచి స్నేహితులు. వాళ్ళ నాన్నగారు గొల్లకోటి రామకృష్ణ గారు రెవెన్యు డిపార్టుమెంటులో పని చేసేవారు.  ఆ తర్వాత తనకి పెళ్ళైపోయి తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు దగ్గర భోగాపురం వెళ్ళిపోయింది. ఆ తర్వాత వాళ్ళాయనకి  భద్రాచలం పేపర్ బోర్డులో ఉద్యోగం వచ్చింది. పేపరుబోర్డు కాలనీకి ఎప్పుడైనా వెళ్తే వీలు చూసుకుని వాళ్ళింటికి వెళ్తుండే వాడిని. ఈమధ్య వాళ్ళాయన వీ ఆర్ ఎస్ తీసుకుని ఇక్కడినుండి వెళ్లిపోయాడని తెలిసింది. ఇప్పుడు ఎక్కడుందో మరి.

ఈసారి ఎలాగైనా అందరం కలుసుకోవాలి. కన్నారావుతో అన్నాను. రాముడితో కూడా అన్నాను. భాస్కర్రావుకూడా కలుసుకుందాం అన్నాడు. ఎక్కడో ఒకచోట కలుసుకోవాలి. ఎలా...
ఆ తర్వాత ఇంటర్ చదవడానికి తలోచోటికీ వెళ్లిపోయాము. అప్పుడు విడిపోయాము. మళ్ళీ ఎప్పటికైనా కలుస్తామో లేదో అనుకున్నాం.

మా అమ్మాయి పెళ్ళికి అందర్నీ పిలవాలని నిర్ణయించుకున్నాను.  అందరి ఫోన్లూ సంపాదించి వాళ్ళతో ఫోన్లో మాట్లాడి పిలిచాను. అందరికీ శుభలేఖలు పంపించాను. పెళ్ళికి కన్నారావూ, రాముడూ, పీటీవీవీ, భాస్కర్రావూ, రవీ, కొంపెల్ల రామ్మూర్తీ వచ్చారు. అమ్మాయి పెళ్లి అనేది ఒక పండగ లా అనిపిస్తే మేమందరం కలుసుకోవడం మరో పండగలా అనిపించింది.  అందరూ మమ్మల్ని చూసి ముచ్చట పడ్డారు.  అందరం ఎక్కువసేపు మాట్లాడుకోలేక పోయినా అందరం ఒకచోట కలుసుకోవడం మాకే గాక మా బంధువులందరికీ కూడా సంతోషం కలిగించింది. 
ఈ సంతోషాన్ని మరింత పెంచు కోవాలంటే పెళ్ళిలో గాకుండా విడిగా అందరం కలుసుకోవాలి.  ఎలా...
...
మనం కూడా మరోసారి కలుసుకుందాం..

27, అక్టోబర్ 2012, శనివారం

మా ఊరూ, మా బడీ..



మా ఊరు...
చిన్నప్పుడు నేను పెరిగిన ఊరు...
నా బాల్యంలో నాకెన్నో అనుభూతులు మిగిల్చిన ఊరు...
నాకు చదువు చెప్పిన ఊరు...
నాకు సుద్దులూ, బుద్ధులూ చెప్పిన ఊరు...
నేను పెద్దయ్యి చదువూ, ఉద్యోగం నిమిత్తం బయటికి వచ్చేసినా...
నా చిన్నప్పటి జ్ఞాపకాలను నిక్షిప్తం చేసుకుని మిగిలిపోయిన ఊరు...
తలుచుకుంటేనే ఒళ్ళు పులకరించి పోతుంది.

ఆనాటి ఆ జ్ఞాపకాలు చిన్నప్పటి ఆ తీపి గురుతులూ నా జీవితంలో ఎన్నో సందర్భాలలో ఎన్నో సార్లు నేను గుర్తుకు తెచ్చుకుని ఎంతో ఆనందాన్నీ, స్పూర్తినీ పొందాను.  ఆనాడు నాకు చదువు చెప్పిన మాస్టార్లు, వాళ్ళు చేసిన మార్గ దర్శకత్వం నా తరవాతి జీవితంలో నాకెంతో ఉపయోగపడ్డాయని చెబితే అది అతిశయోక్తి కాదు.  అవెలా ఉపయోగపడ్డాయో తరవాత చెబుతాను. ఉపయోగపడ్డాయని చెప్పడం మాత్రం చాలా చాలా నిజం. అంతే కాదు.  ఆనాడు నాతో కలిసి చదువుకున్న, నాతో కలిసి తిరిగిన నా చిన్ననాటి స్నేహితులూ నా ఇరుగుపొరుగువారితో నా పరిచయం, వారితో నాకున్న సాన్నిహిత్యమూ  ఇంకా ఆ పరిసరాలు కూడా నాపై ఎంతో ప్రభావం చూపాయి. ఆ ప్రభావం ఎంతో తర్వాత్తర్వాత మీకే అర్ధమవుతుంది.

నాకు ఎన్నో ఎన్నెన్నో అనుభవాలనీ, అనుభూతుల్నీ, స్నేహితుల్నీ, ఇచ్చి నన్ను ఎంతో ప్రభావితం చేసిన గురువులని ప్రసాదించింది మా ఊరి బడి.
ఆ ఊరు వరరామచంద్రపురం. ఆ బడి జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్. 

ఖమ్మం జిల్లాలోని  భద్రాచలం తాలూకాలో ఒక మారుమూల ప్రాంతం వరరామచంద్రపురం మండలం.  ప్రస్తుతం దాన్నే మండల కేంద్రం గా మార్చారు. అక్కడికి ఒక కిలోమీటరు దూరంలోనే రేకపల్లి. అదే మా సొంతూరు. మా ఊరికి తూర్పు వైపు, ఉత్తరం వైపూ అంతా దట్టమైన అటవీ ప్రాంతమే. పడమటి వైపు శబరీ, దక్షిణం వైపు గోదావరీ సుమారు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ప్రవహిస్తూ ఉంటాయి. ఆ ప్రవాహం ఇప్పటిది కాదు. కానీ ఎప్పటికప్పుడు పాతని వదిలించుకుని ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. అదే కదా ఈ నదుల్లోని గొప్పదనం. నిలిచి ఉండేనీరు నాచుతో నిండి ఉంటుంది. ప్రవహించే నీరు ఎప్పుడూ స్వచ్చంగానే ఉంటుంది కదా?
తూర్పున వాలి సుగ్రీవుల కొండలని రెండు కొండలు ఉన్నాయి. అవి నిజంగానేవాలి సుగ్రీవుల్లాగానే అనిపిస్తాయి. ఆకాశానికి రొమ్ము ఎదురొడ్డి ఠీవిగా నిటారుగా నిలిచి ఉండే కొండ ఒకటి. దాన్నే వాలి కొండ అంటారు... దానికి దాసోహం అంటున్నట్టుగా దాని చెంత మోకరిల్లి నట్లుండే కొండ ఇంకోటి. దాన్ని సుగ్రీవ కొండ అంటారు. ఆ రెండు కొండల మధ్యన వారధిలా ఉండే కొండపై ఒక రామాలయం ఉంది. ఆ కొండ పాదాలచెంత ఊరే శ్రీరామగిరి. వాటిని చూస్తుంటే ఆనాటి శ్రీరాముడు అక్కడే నివసించాడనే ఆ ప్రాంత వాసుల నమ్మకం నిజమేనేమో అనిపిస్తుంటుంది. ఆ ఊరి గురించి మరోసారి చెప్పుకుందాం.

ఇంక.. మా ఊరి విషయానికి వచ్చేద్దాం...

అప్పట్లో మా ఊరికి రావాలంటే మామూలు నాటు పడవలమీద శబరి గానీ, గోదావరి గానీ  దాటి రావాల్సిందే. కిరాయికి ఆటోలు గానీ, రిక్షాలుగానీ ఉండేవి గావు. అంతా కాలి నడకే. అసలు ఆ ప్రాంతంలోని ఏ ఊరికి వెళ్ళడమన్నా ఓ గొప్ప ప్రహసనమే. మా ఊరికి వచ్చే అధికార్లు కూడా వారి జీపులూ, వాహనాలూ పడవల్లో నది దాటించి వచ్చేవారు. వర్షాకాలమైతే ఆ బాధలు వర్ణనాతీతమే! కొన్ని కొన్ని ఊళ్ళకి వెళ్ళాలంటే మోకాలి లోతు నీళ్ళల్లో కొన్ని సందర్బాల్లో నడుం లోతు నీళ్ళల్లో నడుచుకుంటూ వెళ్లాల్సిందే.

చిన్నతనంలో మాకు తెలిసిన మోటారు వాహనం అంటే అధికార్లు వేసుకు వచ్చే జీపే. దుమ్ము రేపుకుంటూ జీపు వస్తే దానివెనక కొంతదూరం పరుగులు పెట్టే వాళ్ళం. ఎక్కడైనా జీపు ఆపి కనబడితే దానిదగ్గరకి వెళ్లి దానిచుట్టూ తిరుగుతూ దాని పొగ వాసన పీలుస్తూ ఆనంద పడే వాళ్ళం.  మాకు తెలిసిన రవాణా వాహనం అంటే కూనవరం నుండి రాజమండ్రి వరకూ నడిచే లాంచీనే. అప్పుడప్పుడూ లారీలు వచ్చేవి.  ఆ తర్వాత ఒకటి రెండు ట్రాక్టర్లు తిరిగేవి. డిసెంబరు నెలనుండి బేరన్ పుగాకు క్యూరింగ్ కోసం బెరన్లకు కట్టెలు తేవడానికి కొన్ని లారీలూ, ట్రాక్టర్లూ వచ్చేవి. మోటార్ సైకిళ్ళు కూడా ఎక్కువ ఉండేవి కావు. ఎక్కడైనా అవి ఆగి ఉంటే ఒకసారి ఎక్కి ఆనందించే వాళ్ళం. అలా ఎక్కడంలో కింద పడ్డాలూ, ఎక్కుతుంటే ఆ వాహనాల డ్రైవర్లు అరుస్తుంటే ఎక్కడివాళ్ళక్కడ చెల్లాచెదురై పారిపోవడాలూ ఇప్పటికింకా నా కళ్ళముందు కదలాడుతూనే ఉంటాయి.

అలాంటి ఊరికి ఎక్కడి నించో వచ్చి మాకు పాఠాలు  చెప్పిన మాస్టార్లు అంటే మాకు భయంతో కూడిన అభిమానం, ఇంకా ఎంతో గౌరవం కూడానూ. వాళ్ళను చూస్తుంటే మాకు భయం కంటే కూడా ఎంతో గౌరవ భావం కలుగుతుండేది.  అప్పట్లో ఈ ప్రాంతానికి ఉద్యోగానికి రావడం అంటే ఒకరకంగా సాహసం లాంటిదే. బంధువులందరికీ దూరంగా ఉంటూ వాళ్ళున్న ప్రాంతాన్నే వారి స్వంతం చేసుకుని ఆ ప్రాంతం వాళ్లనే స్వంతవాళ్ళు గా భావించి వారికి తెలిసిన విద్యను మాలాంటి వాళ్ళకు నేర్పించి మమ్మల్ని ప్రయోజకులను చేసిన మాస్టార్లకి ఏంచేస్తే ఋణం తీరుతుంది? 

అందుకే అప్పట్లో చదువు కున్న పాత విద్యార్ధులం అందరం కలుసుకుని మాకు చదువు చెప్పిన గురువుల్ని సత్కరించుకునే ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నాం.  మేం పదవ తరగతి చదివేటప్పుడు అంటే 1973-74 సంవత్సరంలో మా క్లాసులో 16 మందే ఉండే వాళ్ళం.  అందులో ముగ్గురు అమ్మాయిలు ఉండేవాళ్ళు.

మా క్లాస్ మేట్లు ఒక్కొక్కళ్ళూ ఒకోరకం. నేను అందర్లోకీ పొట్టిగా ఉండేవాడిని. అందుకని నన్నంతా పొట్టోడు అనేవాళ్ళు. నాకు ఏడుపు వచ్చేది. దాన్ని చూసి పొట్టి బుడంకాయ్ అంటూ నన్ను ఇంకా ఉడికించేవాళ్ళు. అయినా అందర్లోకీ నేనే యాక్టివ్ గా ఉండే వాణ్ని. మా నాన్న ప్రతీరోజూ రాత్రి పడుకునేముందు మాకు కధలు చెప్పేవాళ్ళు. ఆ కధల్లో కల్పితాల కంటే ఎక్కువ పురాణాలూ, చరిత్ర, దేశభక్తీ, భూగోళం, సైన్స్ .. ఇలా అన్ని విషయాలూ ఉండేవి. అవన్నీ మా పాఠాలలో ఉండేవే. అందువల్ల మా మాస్టార్లు మాకు పాఠాలు చెప్పేటప్పుడు ఏమైనా ప్రశ్నలు వేస్తే నాకు వెంటనే మా నాన్న చెప్పిన కధల్లోని విషయాలు గుర్తుకు వచ్చేవి. నేను వెంటనే చెప్పేసే వాడిని. అందుకని నన్ను ఈ పొట్టోడికి జనరల్ నాలేడ్జీ ఎక్కువే  అనేవాళ్ళు. అలా అని నేనేం ఫస్ట్ క్లాస్ స్టుడెంట్ ని కాను. ఎప్పుడూ తప్ప లేదు కానీ, మార్కులు ఎక్కువ వచ్చేవి కావు.

నేనూ, నాతోపాటు మావూరి కరణం గారబ్బాయి రవి .. నా క్లాస్ మేట్ .. రవి తమ్ముడు సుధాకర్ .. మాకంటే రెండేళ్ళు చిన్నవాడు .. వాళ్ళ బాబాయి సత్తిబాబు, అందరం కలిసి రేకపల్లి నుంచి వెళ్ళేవాళ్ళం. రేకపల్లి నుండి వరరామచంద్రపురం (విఆర్ పురం అని కూడా అనేవాళ్ళం) లోని మా స్కూలు రెండు కిలోమీటర్లు ఉండేది. ఈ రెండు ఊళ్లకీ మధ్య ఓ చెరువూ, ఆ చెరువు గట్టుమీద ఓ మామిడి చెట్టూ, ఆ చెట్టు కింద నీడలో ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహాలూ ఉండేవి. నాకు భక్తి కాస్త తక్కువే. కానీ, సత్తిబాబూ, రవీ, సుధాకర్ లకి భక్తి ఎక్కువగానే ఉండేది. అందుకని వాళ్ళు ప్రతీరోజూ బడికి వెళ్ళేటప్పుడూ, వచ్చేటప్పుడూ తప్పనిసరిగా అమ్మవారికి దణ్ణం పెట్టుకునేవాళ్ళు. భక్తి మాటెలా ఉన్నా, వాళ్ళతోపాటే నేనుకూడా దణ్ణం పెట్టుకునేవాణ్ని. పరిక్షల సమయాల్లో ఈ భక్తి కాస్త ఎక్కువగా ఉండేది.  మామూలు రోజుల్లో శనివారం నాడే కొట్టే కొబ్బరికాయ పరిక్షల్లో రోజూ కొట్టేవాళ్ళు. 

రవి అసలు పేరు మాదిరెడ్డి సూర్యనారాయణ. బాగా చదివేవాడు. చాలా సున్నిత మనస్కుడు. తనకు ఏ సబ్జెక్టు లోనైనా తను అనుకున్నదానికంటే తక్కువ మార్కులు వచ్చాయంటే మొహం ఎర్రబడిపోయి కళ్ళల్లోకి నీళ్ళు వచ్చేసేవి. ఎవరైనా ఏమైనా అన్నాకూడా కళ్ళల్లోకి నీళ్ళు వచ్చేసేవి. ప్రస్తుతం ఖమ్మం జిల్లా  ఎర్రుపాలెం మండలం మామునూరు హైస్కూల్ హెడ్ మాస్టారుగా పనిచేస్తున్నాడు.  అంత సున్నితమైన మనసు కలవాడు ఓ హైస్కూల్ ని నిర్వహించడమంటే మామూలు విషయం కాదు.

ఇంకా మా క్లాస్ మేట్లలో సత్తిపండు అని స్టోరు గుమస్తా గారి తమ్ముడు. ఏడో తరగతి నుండి మాతో కలిసాడు. అసలుపేరు పెంజర్ల త్రినాధ వీర వెంకట సత్యనారాయణ. వాడు తనపేరు పెద్దదని బడాయి పోయేవాడు. చాలదన్నట్లు గొప్పగా తన అసలు పేరు పెంజర్ల త్రినాధ వీర వెంకట బ్రహ్మ విష్ణు మహేశ్వర సత్యనారాయణ అనీ, పెద్దదని పిలవడం కష్టం అవుతుందని తనపేరు సగమే రాయించారని చెపుతూ ఉండేవాడు. మేం మాత్రం వాడిని పీటీవీవీ అని షార్ట్ కట్లో పిలిచేవాళ్ళం. వాడు నల్లగా ఉండేవాడు. అందుకని వాడిని ఏడిపించేటప్పుడు సత్తిపండూ, చింతపండూ అని పిలిచేవాళ్ళం. మా అందర్లోకీ ముందుగా ఉద్యోగం సంపాదించింది వాడే. ఇంటర్ కాగానే చిన్నదో పెద్దదో సూపర్ బజార్ లో ఉద్యోగం సంపాదించాడు. అప్పటి నుండీ ఖాళీ లేకుండా ఏదో పని చేస్తూనే ఉండేవాడు. మా అందరికంటే ముందే భద్రాచలంలో ఇల్లు కూడా కట్టుకున్నాడు. ప్రస్తుతం తణుకులో తనే స్వయంగా సూపర్ బజార్ పెట్టాడు.
ఇంకో క్లాస్ మేట్ గుండుపూడి భాస్కర్ రావు. పీటీవీవీతో ఎప్పుడూ గొడవ పడేవాడు వీడు. వీళ్ళకి హోటల్ ఉండేది. హోటల్లో టిఫిన్లూ అవీ బాగానే తిన్నా, బక్కగా ఉండేవాడు. అందరం వీడిని బక్కోడా అనేవాళ్ళం. వీడికి డాన్సుల పిచ్చి. అక్కినేని నాగేశ్వర రావులాగా పోజులు కొడుతూ ఉండే వాడు. ఓసారి కబాడీ ఆడుతుంటే ముక్కుకు దెబ్బ తగిలి ముక్కు రూపం కాస్త మారింది. అప్పట్నుంచీ  పీటీవీవీ వాడిని ముక్కొంకరోడా అని పిలిచేవాడు. ఇద్దరికీ క్షణం పాడేది కాదు. అయినా ఇద్దర్నీ ఎప్పుడూ విడి విడి గా చూడలేదు మేం. ఎప్పుడూ కొట్టుకుంటూనే కలిసి వుండేవాళ్ళు.  ఇప్పటికీ అంతే.
వీళ్ళకి తోడు ములకల అశోకు .. వీడు నాకంటే సంవత్సరం చిన్నవాడు. కానీ మా క్లాసే చదువుతుండేవాడు. పదో తరగతి పరీక్షలప్పుడు వయసు తక్కువయిందని డాక్టరు సర్టిఫికేట్ తెచ్చుకో మన్నారు. వాళ్లకి కిరాణా షాపు ఉండేది. తల ఎప్పుడూ నూనె కారుతూ ఉండేది. గమ్మత్తుగా ఫంకు వచ్చేలా దువ్వుకునేవాడు. ఓ పిచ్చుక దాక్కో గలిగేలా ఉండేదా ఫంకు. రాత వాడి కళ్ళల్లాగానే పెద్దగా గుండ్రంగా ఉండేది. పీటీవీవీ, గుండుపూడి, అశోకు పక్క పక్క ఇళ్లల్లోనే ఉండేవాళ్ళు. అందుకని ముగ్గురూ ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళు. అశోకు’ప్రస్తుతం విఆర్ పురం లోనే  ఓ కిరాణా షాపు నడుపుతున్నాడు. మా అందర్లోకీ మా ఊళ్ళోనే స్థిరపడి ఉన్నది వాడే. 
మా క్లాస్ మేట్ లలో రవిలాగా బాగా చదివేవాడు  వేమన సూర్య ప్రకాశరావు .. వీళ్ళకి కూడా కిరాణా షాపు ఉండేది. రాత చాలా బాగుండేది. సైన్స్ బొమ్మలు, మ్యాపులు కూడా బాగా వేసేవాడు. కొద్దిగా సిగ్గరి. ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. ప్రస్తుతం జాంపేట కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో ఆఫీసరుగా చేస్తున్నాడు.
ఇంక పండా రాముడు, బీరబోయిన కన్నారావూ, సవలం సుబ్బయ్య .. వీళ్ళు ముగ్గురూ హాస్టల్ లో ఉండి చదివేవాళ్ళు. ముగ్గురూ గిరిజన కుటుంబాలకు చెందినవాళ్ళు. 
పండా రాముడు నల్లగా, బలంగా ఉండేవాడు. మా ఊరికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలోని పెదమట్టపల్లి అనే ఓ గిరిజన గ్రామం వాళ్ళ స్వంత ఊరు. చింత, మామిడి, ఇప్ప చెట్లతో నిండి ఉండేది ఆ ఊరు. తాటి చెట్లుకూడా బాగా ఉండేవి.  గిరిజన గ్రామమనీ, అడవిలో ఉందనేగానీ, చాలా బావుండేది వాళ్ళ ఊరు. హాస్టల్లో ఉంటూ ఆరో తరగతి నుండీ మాతో పాటే చదివాడు. కబడ్డీ బాగా ఆడేవాడు. చేతి రాత గుండ్రంగా ఉండేది. ప్రతీ విషయాన్నీ బాగా గుర్తు పెట్టుకునే వాడు. తర్వాత్తర్వాత ఉస్మానియా యునివర్సిటీ లో పీజీ చేసి హైదరాబాద్ లోనే ఉద్యోగం సంపాదించి శ్రీకాకుళం జిల్లాలో ముఖ్య ప్రణాళికాధికారి గా పని చేస్తూ ఈ మధ్యనే (మే 2012) అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచి పెట్టి ఏదో పనున్నట్టు వెళ్ళిపోయాడు.
ఇంక బీరబోయిన కన్నారావు .. వీళ్ళ ఊరు మా ఊరికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న రామవరం. శబరి నదిలో కలిసే సోకిలేరు అనే వాగు వడ్డునే ఉంటుంది. ఇది కూడా గిరిజన గ్రామమే. ఏడవ తరగతి వరకూ చింతూరు హాస్టల్లో చదువుకుని ఎనిమిదవ తరగతి నుండీ మాతో కలిసి చదివాడు. బాగా చదివేవాడు. చక్కని చేతిరాత అతని సొంతం. చక్కగా బొమ్మలు వేసేవాడు. నా చేతి రాత బాగుపడిందంటే, నేను బొమ్మలు వేయడం మొదలు పెట్టానంటే అతన్ని చూసే. తను కూడా ఉస్మానియా యునివర్సిటీలో సీటు సంపాదించి హైదరాబాదులోనే ఉద్యోగం సంపాదించి ప్రస్తుతం ప్రభుత్వ బీమా సంస్థలో రీజనల్ డైరెక్టరుగా విశాఖపట్నంలోఉద్యోగం చేస్తున్నాడు.
ఇంకా సవలం సుబ్బయ్య .. తనుకూడా కన్నారావు వాళ్ళ ఊరికి దగ్గరలోనే ఉన్న చూటూరు అనే ఊరికి చెందినవాడు. తనూ, కన్నారావూ కూడా చింతూరు హాస్టల్లోనే చదివారు.ఎనిమిదో తరగతి నుండీ మాతో కలిసి చడువాడు. వీళ్ళు ముగ్గురూ ఇంటర్మీడియట్ నాతొ భద్రాచలం జూనియర్ కాలేజీలో చదివారు. సుబ్బయ్య మాత్రం ఇంటర్మీడియేట్ తో ఆపేసి వాళ్ళ ఊరు వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుంటూ అక్కడే ఉండిపోయాడు. ఆ తర్వాత కొద్దిరోజులు ఏదో  స్వచ్చంద సంస్థలో పనిచేసాడు. అనంతరం ఐటిడిఏ వారిచ్చిన అవకాశంతో వాళ్ళ ఊరికి దగ్గరిలోని ఒక ఊళ్ళో టీచరు గా ఉద్యోగం చేస్తున్నాడు. 

ఇంక అమ్మాయిల విషయానికొస్తే మా క్లాసులో ముగ్గురు అమ్మాయిలు ఉండేవాళ్ళు. ఎనుముల రాజేశ్వరి - రేకపల్లిలోనే వాళ్ళిల్లు. మేము బయలుదేరే సమయానికే తనూ బయలుదేరేది. ఇంకా మా ఊళ్లోని ఇతర ఆడపిల్లలతో కలిసి మా వెనకాలే వచ్చేది. బాగానే చదివేది. నోటిలో నుంచి మాట  పెగిలేది కాదు. ఇంకో అమ్మాయి మట్టా అమ్మాజీ. వాళ్ళ నాన్నగారు టీచరుగా పనిచేసేవారు. వాళ్ళు రేకపల్లికి మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే ఉమ్మడివరం అనే గిరిజన గ్రామంలో ఉండేవాళ్ళు. ఆ అమ్మాయికి వాళ్ళ నాన్నగారు చిన్న సైకిల్ కొనిచ్చారు. ఆ ఊరినించి ఒక్కతే సైకిల్ పై వచ్చేది. చాలా ధైర్యంగా ఉండేది. ఈ అమ్మాయి గొంతు కూడా సన్నగానే ఉండేది.  మూడే అమ్మాయి పేరు అన్నంరాజు విజయలక్ష్మి వడ్డిగూడెం నుండి వచ్చేది. ఈ ఆమ్మాయి గొంతు కాస్త బొంగురుగాఉండి  కాస్త గంభీరంగా ఉండేది. మిగతా ఇద్దరికంటే కాస్త గట్టిగా వినిపించేది.   వీళ్ళ గొంతు గురించి ఎందుకు ప్రత్యేకంగా చెబుతున్నానంటే వాళ్ళ ముగ్గురి గొంతులూ కూడా క్లాసులో ఎక్కువగా వినిపించేవి కావు.  మా హిందీ మాస్టారు పాపయ్య శాస్త్రి గారు వాళ్ళ ముగ్గురి గొంతులనూ విన్నతర్వాత  వాళ్లకి గొంతు కాస్త గట్టిగా వినిపించే విజయలక్ష్మికి "నీరసం" అనీ, కాస్త బాగా వినిపించే అమ్మాజీకి "అతినీరసం" అనీ, మాట అసలు వినిపించని రాజేశ్వరికి "మహానీరసం" అనీ పేర్లు పెట్టేశారు.  ఒకసారి పాటలపోటీలో విజయలక్ష్మి భానుమతి పాడిన "శరణం .. నీదివ్య శరణం..." పాటని పాడింది. అప్పటినుండీ ఆ అమ్మాయిని అందరూ "శరణం.." అనే పిలిచేవాళ్ళు.  కానీ ఆ అమ్మాయి తనని ఏడిపించే వాళ్ళందరికీ బాగానే సమాధానం చెప్పేది.  

వీళ్ళతో పాటు మాకంటే ముందు సంవత్సరం పదో తరగతి చదివిన ముగ్గురు .. మాదిరెడ్డి సత్యనారాయణా, జవ్వాది రామకృష్ణా, మల్లాది రాజేంద్ర ప్రసాదూ, బీరబోయిన వీర్రాజూ కూడా మాతో కలిసి చదివారు. అప్పట్లో ఎవరైనా పదో తరగతి తప్పితే మళ్ళీ సంవత్సరమంతా చదవాల్సి వచ్చేది. కంపార్టుమెంటల్ పద్ధతి లేదు.  దాంతో చాలామంది అక్కడితో చదువు ఆపేసేవాళ్ళు. కానీ వీళ్ళు నలుగురూ చదువు ఆపెయకుండా  మళ్ళీ చదివారు. బాధాకరమైన విషయమేమిటంటే వీళ్ళల్లో జవ్వాది రామకృష్ణా, మల్లాది రాజేంద్ర ప్రసాదూ మనమధ్యలేరు. కారణాలేవయితేనేమి.... చాలా చిన్న వయసులోనే ఈలోకం విడిచి వెళ్ళిపోయారు. మాదిరెడ్డి సత్యనారాయణ ..
అందరం అతన్ని సత్తిబాబు అని పిలిచేవాళ్ళం... తుపాకి పట్టుకుని వేటకి వెళ్ళేవాళ్ళం. చెరువులో చేపలు పట్టేవాళ్ళం. దీపావళి పండక్కి జువ్వలూ, సిసింద్రీలూ, మతాబులూ చేసేవాళ్ళం. మేమిద్దరం చాలా చాలా ఎంజాయ్ చేశాం. తర్వాత ఐటిఐ చదివి రేకపల్లిలోనే రైసు మిల్లూ, కిరాణా షాపూ, ఫోటో స్టుడియో వగైరాలు చాలా నడిపి ప్రస్తుతం పాపికొండలు పర్యాటకంలో ప్రముఖ పాత్ర నిర్వహిస్తున్నాడు. రాజకీయంగా కూడా బాగానే పలుకుబడి గడించాడు.  బీరబోయిన వీర్రాజు వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ ఊళ్లోనే ఉంటున్నాడు.
మేమందరం  ఒకసారి కలుసుకుని పూర్వ విద్యార్ధుల సమ్మేళనం నిర్వహించి అప్పుడు మాకు చదువులు చెప్పిన గురువుల్ని సన్మానించాలి అని అనుకున్నాం.  ఆ వివరాలు నా తరవాతి పోస్ట్ లో చెబుతాను. ఇప్పటికి ఈ పోస్టు ఇక్కడితో ఆపేస్తాను. సరేనా?